Saturday, May 18, 2024

TS | త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలోనే మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇవ్వాల (గురువారం) పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ ఏడాదిలో వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని, వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలిబుచ్చారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పని చేయాలని కోరారు.

- Advertisement -

శాసనమండలి సభ్యులు పార్టీకు చెవులు, కళ్లు మాదిరిగా పనిచేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత చేపడతామని పేర్కొన్నారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని.. అందులోనే శాసన మండలి పార్టీ నేతను ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున కాంగ్రెస్‌పై ఒత్తిడి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌కు గుర్తు చేస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని ఆయన హెచ్చరించారు. శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకొని రానున్న వివిధ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్‌ బ్యూరో వరకు పునర్య్వవస్థీకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ భావిస్తున్నారని చెప్పారు.

చురుకైన నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని, వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పనిచేయాలని వారికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement