Friday, May 3, 2024

TS : సీనియర్ సీపీఐ నేత సామల మల్లేశం కన్నుమూత… కేటీఆర్ సంతాపం

సిరిసిల్ల, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్) : సీనియర్ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్థ శతాబ్దంగా కార్మిక ఉద్యమ నాయకులుగా అనేక పోరాటాలలో ముఖ్య భూమిక పోషించిన సామల మల్లేశం (78) ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. చేనేత, పవర్ లూమ్, బీడీ, నివేషన స్థలాలు, భూ పోరాటాలకు కార్మిక నాయకులుగా అంకితమై కార్మిక ఉద్యమాలలో కీలకంగా పనిచేసిన సామల అమరత్వం పొందడం కార్మిక వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గం లో కార్మిక వర్గం, పేదల సమస్యల కోసం నిరంతరంగా కొట్లాడిన వ్యక్తి సామల మల్లేశం. సిరిసిల్లలోని రాయిని చెరువును పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ పక్షాన కొట్లాడి ఇండ్ల స్థలాలను సాధించుకోవడంలోనూ, సాధించుకున్న స్థలాలకు బద్దం ఎల్లారెడ్డి నగర్ (బివై నగర్) గా నామకరణం చేసుకోవడంలో భాగస్వామ్యం అయ్యారు. సిపిఐ సీనియర్ నాయకులుగా, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యాక్షులుగా, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన మల్లేశం మున్సిపల్ పాలకవర్గంలో పనిచేయాలన్న కోరిక మాత్రం ఆయనకు నెరవేరలేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లేశం నివేషణ స్థలాల పోరాటంలో సాధించుకున్న బివై నగర్ లోని ఇంటిలో కన్నుమూశారు. మల్లేశంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సామర్ల మల్లేశం మృతి పట్ల మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావుతో సహా అన్ని పార్టీల నాయకులు, కార్మిక నాయకులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement