Friday, April 26, 2024

TS: పెద్దపల్లిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి, పెద్దపల్లి పార్లమెంట్ ఉపాద్యక్షులు అందె భాస్కరాచారి పార్టీ జెండా ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ… 42సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలకు బాసటగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు పార్టీకి అంకురార్పణ చేసారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించే లక్ష్యంతో నాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నేటికీ బడుగు, బలహీన వర్గాల మదిలో చెరగని ముద్రవేసిందన్నారు.

పేదవాడు అర్దాకలితో అలమటిస్తున్న తరుణంలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవారి ఆకలి తీర్చారన్నారు. సగం ధరకే జనతా వస్త్రాలు, అందరికీ పక్కా ఇళ్ల‌ నిర్మాణం, తదితర సంక్షేమ పథకాలు అందించారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ఇంచార్జి అందె భాస్కరాచారి, పెద్దపల్లి పార్లమెంట్ కార్యదర్శి కోల కిషన్ రావు, టౌన్ అద్యక్షులు కొప్పుల మురళి, పెద్దపెల్లి మండల అద్యక్షులు కలవేణ రాజేశం, కమాన్ పూర్ మండల అధ్య‌క్షులు కీర్తి సత్యనారాయణ, రామగిరి మండల అద్యక్షులు కంటిపూడి రామకృష్ణ, నాయకులు విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement