Wednesday, May 15, 2024

డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాలు

పార్వతీపురం : డెంగ్యూ వ్యాధి నివారణకు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జగన్నాధరావు తెలిపారు. జూలై 1 నుండి 31 వరకు డెంగ్యూవ్యాధి నివారణ మాసోత్సవాలు సంధర్బంగా ప్రజలలో అవగాహన కల్పించుటకు మున్సిపల్ కమీషనరు కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆరోగ్య, మునిపల్, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జగన్నాధరావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి సోకిన దోమ కుట్టుట వలన డెంగ్యూ జ్వరం వస్తుందని, వ్యాధి సోకిన మొదటి వారంలో, డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తి రక్తంలో కనిపిస్తుందని, దోమ సోకిన వ్యక్తిని కుడితే, వ్యాధి దోమకు సోకుతుందని, వ్యాధి సోకిన దోమ కాటు ద్వారా ఇతర వ్యక్తులకు వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. దోమలు నివారించుట ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు దోమతెరలను వాడాలన్నారు. డెంగ్యూ జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమీషనర్ పి. సింహాచలం మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా ముందు జాగ్యత్తగా దోమలు నివారణ చేసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కాలువలలో చెత్త వేయకుండా, తడి,పొడి చెత్త వేరుచేసి మునిసిపల్ సిబ్బందికి అందజేయాలని తెలిపారు.

ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని కోరారు. ఇంటిలో వాడని పాత్రలలో నీరు నిలువ ఉండకుండా చూడాలని, పూలకుండీలు, ఫ్రిజ్ లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని సమర్దవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి పైడిరాజు మాట్లాడుతూ డెంగ్యూ వైరస్ను వ్యాపింపజేసే దోమలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుడతాయని తెలిపారు. ఈ రకమైన దోమలు చికున్గున్యా వైరస్లను కూడా వ్యాప్తి చేస్తాయని, ఈ వ్యాధులను నివారించడానికి ఉత్తమ మార్గం దోమల కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే నని తెలిపారు. దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు .మీ ఇంటి లోపల మరియు వెలుపల దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎ.ఎన్.ఎం ., మున్సిపల్ సిబ్బంది, మలేరియా నివారణ, సచివాలయ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement