Monday, April 29, 2024

KNR: రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.. మాజీ ఎమ్మెల్యే చందర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కొరకంటి చందర్ డిమాండ్ చేసారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుమేరకు గోదావరిఖనిలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ… రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని, వెంటనే రైతుబంధు నిధులు కర్షకుల ఖాతాల్లో జమ చేయాలని, కౌలు రైతులకు హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ధాన్యానికి మద్దతు ధర అందించడంతోపాటు 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు సాగునీరు అందక పంట నష్టపోయారన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా హామీలు పూర్తి చేయని కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిరసన దీక్షలో బారాస నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement