Monday, April 29, 2024

Election Campaign: తెలంగాణలో ఇక దద్దరిల్లుడే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికల వేడి ఊహించని స్థాయికి చేరుకుంటోంది. మూడు ప్రధాన రాజకీయ పక్షాలు పోటాపోటీగా తలపడుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీల అగ్రనేతలూ సవాలుగా స్వీకరిస్తున్నారు. ప్రధానంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఆ రెండు పార్టీల అగ్రనేతలంతా తెలంగాణపై మూకుమ్మడిగా ప్రచార దాడికి సంసిద్ధమై వస్తున్నారు.దీంతో వారం రోజులపాటు ఆఖరి ప్రచార హోరుతో తెలంగాణ దద్దరిల్లనుంది.

ఈ నెల 23 తర్వాత అగ్రనేతలంతా ఒక్కసారిగా వచ్చిపడుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం అదిరిపోనుంది. వారం రోజుల పాటూ దేశంలోని అగ్రనేతలు, ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న నాయకులంతా ఇక్కడికే తరలి రానున్నారు. ప్రధాన మోడీ నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరకూ అందరూ ఇక్కడే ఉండనున్నారు. 23వ తేదీకి మిగతా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియనుంది. ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు. ఇక్కడ నవంబర్‌ 30న పోలింగ్‌ ఉండడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆ రెండు ప్రధాన పార్టీల నేతలంతా తెలంగాణాకు తరలిరానున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మీద ముందు నుంచే అన్ని పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. ఇప్పుడు దీన్ని మరింత ఎక్కువ చేయాలని భావిస్తున్నాయి. అధికార పార్టీ తరఫు నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ అగ్రనేతలు కేటీ-ఆర్‌, హరీష్‌, కవిత ఇతర నాయకులు ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రధాన మోడీ, రాహుల్‌గాంధీతో సహా పెద్ద పెద్ద నేతలంతా రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు పోలింగ్‌కు ముందు 5 రోజులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుదామని డిసైడ్‌ అయ్యాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. అది కూడా ఏదో ఒక్క సభకు రావడం వెళ్ళిపోవడం కాకుండా.. ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు. బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు- చేసుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్‌ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులూ తెలంగాణలోనే ఉండనున్నారు. ఇక్కడ తిరుగుతూ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం, 26న తూప్రాన్‌, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ బహిరంగ సభలతో పాటు- హైదరాబాద్‌ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా 24, 26, 28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మూడు రోజులు ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, హిమంత్‌ బిశ్వశర్మ, సావంత్‌ కూడా రాష్ట్రానికి రానున్నారు.
ఇక కాంగ్రెస్‌ తరుపు నుంచి రాహుల్‌, ప్రియాంక నవంబర్‌ 24 నుంచి 28 వరకు ఇక్కడే ఉండే వరుస సభల్లో పాల్గొననున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాలను పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్‌, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్‌ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు,నాలుగు రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.
ఇక తామేమీ తక్కువ కాదంటూ.. వామపక్ష పార్టీల అగ్రనేతలు సైతం తెలంగాణ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టబోతున్నారు. ఇతర ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్‌, సుభాషిణి అలీ, విజయరాఘవన్‌ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు- హైదరాబాద్‌ సభల్లో పాల్గొననున్నారు. అలాగే జనసేన, బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా రేపటి నుంచి ప్రచార బరిలోకి దిగనున్నారు. 28 వరకు సభలు, రోడ్‌ షోల్లో పాల్గొంటారు. తమ పార్టీ నుంచి పోటీ- చేస్తున్న అభ్యర్ధుల నియోజకవర్గాలు అయిన వరంగల్‌ వెస్ట్‌, కొత్త గూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరులలో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. 26న మాత్రం కూకట్‌పల్లిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement