Sunday, April 28, 2024

Janasena – పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అవినీతి పెరిగింది – పవన్ కళ్యాణ్

పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అవినీతి రహిత, సామాజిక తెలంగాణాను కోరుకున్నానని, కానీ ఇక్కడ తెలంగాణ పోరాట స్ఫూర్తికి విరుద్ధ పాలన జరుగుతోందని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మిత్ర పక్షం బీజేపీ, జనసేన అభ్యర్థుల విజయం కోసం వరంగల్ నగరంలో బుధవారం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనలో పోరాట స్ఫూర్తికి కారణం తెలంగాణ ఉద్యమమని, తెలంగాణ బతుకులు మారుతాయని ఆశించానని, తాను కోరుకున్న మార్పు కనపడలేదన్నారు. ఏపీలో అవినీతి ఉన్న మాట వాస్తవం, కానీ ప్రజలు సాధించిన తెలంగాణాలో అవినీతి పెరగటం బాధకరం అన్నారు.

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి పాల్పడుతాం, 6 శాతం కమీషన్ ఇస్తాం, 8 శాతం, 12 శాతం కమీషన్ ఇస్తామని అంత ధైర్యంగా కాంట్రాక్టర్ మాట్లాడుతుంటే… తెలంగాణ యువత ప్రశ్నించలేని స్థితికి చేరిందన్నారు. ఇక సామాజిక న్యాయానికి చోటు లేదన్నారు. ఒక సభలో గద్డర్ మాట్లాడుతూ, సమాజంలో 50 శాతం పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో చోటు లేదని అన్నారని, అదే స్ఫూర్తితో తన జనసేనను ముందుకు నడుపుతున్నానని, బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నానని, బీజేపీ ఈ కోరికను తీర్చబోతోందన్నారు.

ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు అపార గౌరవమని, దేశ ఆర్థిక స్థితిని ఆయన చక్కదిద్దారని, ఎందరో హామీలు ఇస్తారని, బీజేపీ కూడా హామీలు ఇచ్చిందని, వీటిని నెరవేర్చకునేందుకు యువకులు నడుము బిగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాను ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నిమగ్నమయ్యానని, ఇక తెలంగాణపై దృష్టి సారించానని, వచ్చే ఏడాది నుంచి తెలంగాణాలో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ ఎన్నికల్లో బీస ముఖ్యమంత్రి కావాలంటే, అవినీతి పాలన పోవాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే జన సేన అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ వరంగల్ ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement