Monday, April 29, 2024

Invitation – మ‌ళ్లీ మోస‌పోయావ్…. మా పార్టీలోకి వ‌చ్చేయ్ – ఈట‌ల‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానం ..

హైద‌రాబాద్ .. బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈటలకు ఈ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ అధిష్టానంపై సంచలన కామెంట్ లు చేశారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మాట్లాడుతూ ఈటల రాజేందర్ ను బీజేపీ మళ్ళీ మోసం చేసిందని వాపోయారు అలాగే . ఇటీవల ఆయనకు ప్రాణ హాని ఉందని చెప్పినా రక్షణ కల్పిస్తున్నారు తప్ప.. ప్రాణ హాని కల్పించే ఎమ్మెల్సీని మాత్రం ఇటు బిజెపి, అటు బిఆర్ఎస్ లు ఏమీ చేయ‌లేక‌పోయాయ‌ని అన్నారు.. . చంపే వాళ్లకు ఈ ప్రభుత్వం సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ కళ్ళు తెరిచి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అంటూ త‌మ పార్టీలోకి వ‌స్తే పూర్తి ర‌క్ష‌ణ ఉంటుద‌ని ఈట‌ల‌కు ఆహ్వానం ప‌లికారు రేవంత్ రెడ్డి.

ఇక ధరణి పోర్టల్ అక్రమాలకు నెలవుగా మారిందంటూ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ధరణి రిజిస్ట్రేషన్లు రాత్రి పూట జరుగుతున్నాయని ఆరోపించారు. శంకర్ హిల్స్ ప్రాంతంలో ప్రొహిబిటెడ్ భూముల విషయంలో అర్థరాత్రి వేళ తాళం తీసి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, మళ్లీ తాళం వేసి వాటిని ప్రొహిబిటెడ్ లిస్టు భూములు అంటున్నారని, ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించి తమ పేరు మీదకు మార్చుకుంటున్నారని వివరించారు. ఈ పోర్ట‌ల్ నిర్వ‌హంచే శ్రీధర్ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చు, ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చేయొచ్చు అని వివరించారు. ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లే అవుట్లు వేసి అమ్ముకోవడం ఈ తతంగం ఇలా నడుస్తోందని రేవంత్ వెల్లడించారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు.

ధరణి పోర్టల్ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్ లార్డో మనకు తెలియదు అని వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో క్వాంటెల్లా అనే సంస్థ పేరిట హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గాదె ధ‌ర‌ణి కుంభకోణంలో ముఖ్య సూత్ర‌దారి అని కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలనలో తెలింద‌న్నారు.. ఇక దేశంలో అత్యంత పేద పార్టీ త‌మ‌ద‌ని అన్న రేవంత్ రెడ్డి.. తాము ధ‌న బ‌లంతో కాకుండా ప్ర‌జాబ‌లంతో బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement