Friday, May 17, 2024

Khammam: కాంగ్రెస్ కు ఓటేస్తే 3గంటల కరెంటే.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 3గంటల కరెంటే ఇస్తరని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గం రఘునాథ్ పాలెం మండలం మంచుకొండ గ్రామంలో మండల పార్టీ అద్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధర్నాలో పాల్గొని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్ డౌన్ రేవంత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు.., మళ్ళీ పాతరోజులు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి.. అసలు ఏం తెలుసు నీకు రైతుల గురించి, వ్యవసాయం గురించి, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ అవుతుందని పేర్కొన్నారు. 24 గంటలు విద్యుత్ ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో నీళ్ళు పెట్టుకుంటారు, సమయానికి అనుగుణంగా వ్యవసాయం చేస్తారని తెలిపారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఒక పక్క బీజేపీ రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దంటోంది.. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయిన ఘటనలు అనేకంగా ఉన్నాయని, తాను స్వయంగా చూశానని, పాము కాటు, తేలు కాటుకు గురై మమత ఆసుపత్రిలో చికిత్సలు పొందిన ఘటనలు చూశానన్నారు. రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బీజేపీ పార్టీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని, రైతులు మేల్కొని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూనే వస్తుందని, రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement