పటాన్ చెరు – పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పనైపోయిందని మండిపడ్డారు. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో హరీష్ ఎమ్మెల్యేను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందన్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది ? అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా బంధిపోటా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులున్నా ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
బెదింరించి లొంగదీసుకోవాలనుకుంటున్నారా..
బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు హరీష్ రావు. ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మంత్రి ఆదేశాలతో తాము దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయని, వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు పెట్టారని చెప్పారు… గ్రామాల్లో తాగునీరు రావట్లేదని,… పంటలు ఎండిపోతున్నాయని, అయినా ఇవి పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తామన్నారు. మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారని, పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు.