Wednesday, May 1, 2024

TS: కరీంనగర్‌ ఎంపీగా గెలిచేది నేనే : బోయినపల్లి వినోద్ కుమార్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా నేనే గెలుస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలపై ఆయ‌న‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ రాముడితో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరోసారి కూడా కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్‌కే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement