Tuesday, May 14, 2024

INDvsENG 1st Test | తొలి టెస్ట్‌కు రంగం సిద్దం.. రేపు హైదరాబాద్ రానున్న ఇరు జట్లు !

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు.

ఇవ్వాల (శనివారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు జట్లు రేపు(ఆదివారం) హైదరాబాద్ చేరుకుంటాయని తెలిపారు. ఈనెల 23న పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహిస్తారని చెప్పారు. పార్క్ హయత్ హోటల్‌లో ఇండియా టీమ్, తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇంగ్లాండ్ టీమ్ బసచేస్తాయని జగన్మోహన్ రావు చెప్పారు.

HCA నూతన అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మ్యాచ్ నిర్వహిస్తున్నామని, ఆధునాతన హంగులతో స్టేడియాన్ని తీర్చి దిద్దామని వెల్లడించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మ్యాచ్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఇక ఇప్పటికే టికెట్ విక్రయాలు మొదలవ్వగా.. ఇప్పటివరకు 26 వేల టికెట్స్ విక్రయించినట్టు తెలిపారు. టికెట్ ధరలు 200 నుంచి 4 వేల రూపాయల వరకు ఉన్నాయి. రూ. 200 టికెట్ 5 రోజులకూ కావాలంటే రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. రూ.499 టికెట్ రూ.1497కు ఇస్తారు. వెయ్యి రూపాయల టికెట్‌కు 5 రోజులకు 3 వేలు చెల్లిస్తే సరిపోతుంది. రూ.1250 టికెట్ 5 రోజులకు రూ.3750 కు విక్రయిస్తున్నారు. రూ. 3 వేల రూపాయల టికెట్‌కు రూ.12 వేలు.. రూ.4 వేల టికెట్‌కు రూ.16 వేలు చెల్లిస్తే ఐదు రోజుల పాటు మ్యాచ్ చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement