Friday, May 3, 2024

డిసెంబర్ 2022 నాటికి మంచినీటి సౌకర్యం క‌ల్పిస్తామ‌న్న‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంత కాలనీలకు వచ్చే డిసెంబర్ 2022 నాటికి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు ఎండి దాన కిషోర్ ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు .ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను ఎమ్మెల్యే ఎండి దృష్టికి తీసుకువచ్చారు. దానిలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో మంచినీటి సౌకర్యం లేని శివారు ప్రాంతాల్లో నూతన మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల యందు మంచినీటి సౌకర్యం కల్పించడం తన లక్ష్యమ‌ని తెలిపారు.

ఆలాగే యూ.జీ.డీ.వ్యవస్థ సరిగ్గా లేని కాలనీల యందు కూడా నూతన డ్రైన్స్ పైప్ లైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే గత వరదల్లో కొన్ని కాలనీల యందు యూ.జీ.డీ.వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో మళ్ళీ డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని సూచించారు. అనంతరం దానకిషోర్ స్పందిస్తూ… మొదటి విడతగా దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మంచినీటి సౌకర్యం లేని శివారు ప్రాంతాల్లో వచ్చే డిసెంబరు 2022 వరకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే నూతన యూ.జీ.డీ.వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement