Thursday, April 25, 2024

ప్ర‌ముఖ వైద్యుడు కాక‌ర్ల సుబ్బారావు క‌న్నుమూత‌

హైద‌రాబాద్ – ప్రఖ్యాత రేడియాలజిస్ట్ , ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 96 సంవ‌త్స‌రాలు. కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కాకర్ల వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లోనే ఉత్తీర్ణత సాధించారు. 1954 నుంచి 1956 వరకు అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారు. 1956లో భారత్‌కు తిరిగొచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రధాన రేడియాలజిస్ట్‌గా పదోన్నతి పొందారు. 1970లో తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. 1986 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుమేరకు హైదరాబాదుకు వచ్చి, నిమ్స్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. పదేళ్లపాటు ఎలాంటి వేతనం తీసుకోకుండానే సేవలు అందించారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు రాశారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే, రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా లెక్కలేనన్ని పురస్కరాలను డాక్టర్ కాకర్ల అందుకున్నారు. సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎం కేసీఆర్ సంతాపం
నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement