Sunday, April 28, 2024

CAA Act: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

ఇటీవ‌లే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 14, 25, 21లను ఉల్లంఘిస్తుంది కాబట్టి విచారణ జరిగే వరకు ఈ చట్టం అమలును నిలిపివేయాలని అసదుద్దీన్ కోరారు. కాగా, భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) 2019 అమలు తర్వాత ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మరోసారి భారతీయ జనతా పార్టీపై అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలందరినీ ప్రభుత్వం ఒకే కోణంలో చూడాలి.. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదు అంటూ ఒవైసీ పేర్కొన్నారు. సీఏఏ వల్ల దేశంలో విభజన జరుగుతుందని ఆరోపించారు. ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయాలనుకునే గాడ్సే ఆలోచనపై ఆధారపడి ఉందన్నారు. పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు.. ఐదేళ్లుగా ఈ నిబంధనలను ఎందుకు పెండింగ్‌లో ఉంచారో.. ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి? అని డిమాండ్ చేశారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీతో పాటు సీఏఏ ఉద్దేశం కేవలం ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇతర ప్రయోజనం లేదని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement