Monday, May 6, 2024

TS: బడుగు, బలహీన వర్గాల విద్యా ప్రదాత కేసీఆర్… కిశోర్ గౌడ్

హైదరాబాద్: బీసీ విద్యార్థుల కోసం నూతనంగా మరో 17 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాప్రదాతగా చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రతి ఏడాది అన్ని రకాల గురుకుల పాఠశాలలను దశలవారీగా పెంచుతూ పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాలల వరకు నూతన గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు ఉంటే నేడు 327 గురుకులాలకు చేరుకోవడం జరిగిందన్నారు. దీనిలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఉచితంగా పొందుతున్నారన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి గురుకుల విద్యా విధానం లేదని, కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకే ఇది సాధ్యమైందన్నారు. కళాశాలలో ఫీజులు కట్టలేక, రూమ్ కిరాయిలు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ డిగ్రీ కళాశాలలతో ఎంతో మేలు జరుగుతుందని, దీనివల్ల వారు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడడానికి దోహదపడుతుందన్నారు. ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యార్థులందరూ జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కిశోర్ గౌడ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement