హైదరాబాద్: సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యమని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఆమె మాట్లాడుతూ…. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుందన్నారు. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. బాదంపప్పులు, సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, ఆకుకూరలు తినాలన్నారు. బాదంపప్పులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు-వాటిలో విటమిన్ ఇ, జింక్, ఫోలేట్, ఐరన్ వంటివి ఉంటాయన్నారు. రోగనిరోధక పనితీరును మెరుగు పరచడంలో ముఖ్యమైన పోషకాలుగా ఇవి ఉపయోగపడతాయన్నారు.
అలాగే సిట్రస్ పండ్లు… నారింజ, నిమ్మ, ముసాంబి, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నారు. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం-ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం రక్షణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు విటమిన్ సి తీసుకోవడం పెరుగుతుందని, మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుందన్నారు. వెల్లుల్లికి ఔషధ వినియోగంగా సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ఇది ప్రసిద్ధి చెందిందన్నారు. దీనిలో సహజ సిద్ద సమ్మేళనం అల్లిసిన్ ఉందన్నారు. మీ భోజనంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రుచిని జోడించడమే కాకుండా సూక్ష్మజీవులతో పోరాడటానికి కూడా సహాయ పడుతుందన్నారు. అలాగే ఆకు కూరలు… బచ్చలికూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులు, పుదీనా, ఇతర ఆకు కూరలు రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషించే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయన్నారు. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, ఫోలేట్ వంటి పోషకాలున్నాయన్నారు. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.