Thursday, April 25, 2024

TS | ఏప్రిల్‌ 28న గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ (ఎంజేపీటీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌డబ్ల్యూ)సంక్షేమ, ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 28న నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష- టీజీఆర్‌డీసీ సెట్‌-2024 ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన అభ్యర్థులు ఏప్రిల్‌ 12వ తేదీలోగా అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ సంక్షేమ గురుకుల సొసైటీలో 15 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలలు, ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీలో 26 మహిళా కళాశాలలు, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీలో 6 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా నిర్ణయించారు. ఆయా కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్‌, బీబీఏ, బీఎఫ్‌టీ తదితర అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురుకుల కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన, వసతి అందించనున్నారు. అలాగే యూనిఫామ్స్‌, నోట్‌ బుక్స్‌, టెక్స్ట్‌ బుక్స్‌ మొదలైన సదుపాయాలను అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement