Monday, May 6, 2024

బండికి ద‌మ్ముంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెప్పించాలే: మంత్రి హ‌రీశ్‌రావు

దేశంలో 20 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 19 తెలంగాణలోనే ఉన్నాయ‌న్నారు మంత్రి హరీశ్ రావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలంగాణ ప్రభుత్వ పనిత‌నానికి నిద‌ర్శ‌నం అన్నారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని హరీశ్ మండిప‌డ్డారు. నిన్నటి దాకా అందరికీ బిల్లులు క్లియర్ చేశామని మంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ పనులు మన దగ్గరే ఎక్కువ జరిగాయని హరీశ్ వెల్లడించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అవార్డులు రావడం లేదని హ‌రీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజ‌య్‌కి ద‌మ్ముంటే కేంద్రానికి లేఖలు రాసి రాష్ట్రానికి నిధులు తెప్పించాల‌ని మంత్రి హరీశ్ రావు స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్‌ కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ అయితే.. బీజేపీ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టే పార్టీ అంటూ హరీశ్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ అంటే 24 గంటలు కరెంట్ అని మంత్రి అభివర్ణించారు. బోర్లకు మీటర్లు పెట్టని రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఉండేదని.. ఇప్పుడు దానికి దీటుగా వ్యవసాయం చేసే రైతులకు డిమాండ్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. రైతు బీమా పథకం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement