Friday, May 17, 2024

12 ఏళ్లలోపు పిల్లలకు ఫ్రీ ..

ప్రయాణికులను ఆకర్షించడమే పరమాధిగా పని చేస్తున్న ఆర్టీసీ త్వరలోనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతోంది. 12 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత బస్‌ సౌకర్యం కల్పించే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సంస్థను గాడిన పెట్టేందుకు కొన్నాళ్ళుగా ప్రభుత్వం, పాలకవర్గం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ఇప్పటికే పలు పథకాలను అమలులోకి తెచ్చింది. డిపాజిట్‌ లేకుండా శుభకార్యాలు, విహార యాత్రలు తదితర వాటికి బస్‌లు నడపడం, పండుగ వేళల్లో సరిపోయే విధంగా ప్రయాణికులు ఉంటే కాలనీల నుంచే బస్సులు నడిపించడం, పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులలో ప్రత్యేక చార్జీల వసూలు నిలిపి వేయడంలాంటి కార్యక్రమాలను చేపట్టింది. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింత ఆకర్షించడంతో పాటు ఆర్టీసీకి ధీటుగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాలను కట్టడి చేసేందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు దృష్టి సారించి నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికే పాఠశాలకు వెళ్ళే 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ అందిస్తోంది. భవిష్యత్‌లో 12 సంవత్సరాల లోపు పిల్లలు టీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో ఎంత దూరమైనా ఉచిత ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ అనుమతించనుంది. 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పించడం వల్ల వారి తలిదండ్రులు, బంధుమిత్రులు కూడా బస్సులలోనే ప్రయాణం చేస్తారని, తద్వారా ఆక్యుపెన్షీ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో ఐదేళ్ళు పైబడి 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు చార్జీలో సగం డబ్బులను వసూలు చేసేవారు. పిల్లలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వస్తే ఆర్టీసీలో హాఫ్‌ టికెట్‌ వ్యవస్థ పూర్తిగా రద్దు కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement