హైదరాబాద్, ఆంధ్రప్రభ : గత ఎనిమిదేళ్ళలో మైనార్టీల సంక్షేమానికి రూ.6,644 కోట్ల ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే ఉండేవని, ఈ ఎనిమిదేళ్ళ కాలంలో 192 మైనార్టీ గుకుకులాలను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. మైనార్టీ బాలికలు చదువుల్లో ముందు ఉండాలనే లక్ష్యంతో 50 శాతం గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ గురుకులాలకు విశేష స్పందన రావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలకు సంఖ్య 204 పెరిగిందని తెలిపింది. గురుకులాల్లో మొత్తం లక్షా 14 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, ఒక్కో విద్యార్థిపై ఏడాదికి ఒక లక్షా ఇరవై వేల ఖర్చు చేసి నాణ్యమైన విద్యతో పాటు భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
121 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారు. బాలికల్లో ఎన్రోల్మెంట్ 42 శాతానికి పెరిగింది. మైనారిటీ బాలికల విద్యావికాసంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 రెసిడెన్షియల్ మైనార్టీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం జరుగుతుంది.అలాగే హైదరాబాద్లో 29 కాలేజీ భవనాల నిర్మాణానికి వక్ఫ్బోర్డు స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్ – ఉల్ – గుర్బాను పునర్మించింది. మసీదుల్లోని ఇమాం, మౌజమ్లకు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుంది. మైనారిటీల ప్రధాన పండుగలైన క్రిస్మస్, రంజాన్లను ప్రభుత్వ పండుగలగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మైనారిటీలకు కొత్తబట్టల బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.