Thursday, May 2, 2024

MDK: ప్రతి విద్యార్థి క్రీడల్లో భాగస్వామ్యమై విజయం సాధించాలి… హరీశ్ రావు

సిద్ధిపేట, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్): క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, మీ ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో భాగస్వామ్యమై బాగా ఆడి విజయాలు సాధించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు. 67వ సిద్ధిపేట క్రీడా సమాఖ్య 2023-24 జిల్లా స్థాయి పాఠశాలల ఆటల పోటీలకు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పరేడ్ గ్రౌండ్ వేదికైంది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి హాజరై క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, రిజర్వాయర్లు, క్రీడలు ఇలా అన్నీ రంగాల్లో సిద్ధిపేటను ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే సిద్ధిపేట స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం రూ.11కోట్లు విడుదల చేయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు.

విద్యతో పాటు క్రీడలు కూడా ఆడటం అంతే ముఖ్యమని, ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు అన్నట్లుగా ఆరోగ్యం బాగలేకపోతే ఎంత చదివినా, ఎంత డబ్బున్నా ఉపయోగం లేదని, మీరంతా మీ అభిరుచులకు అనుగుణంగా క్రీడలు ఆడి ఆటల్లో రాణించాలని కోరారు. మంచి క్రీడాకారులను అందించి, పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని క్రీడా, వైద్య శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలు గ్రామీణ ఆటలుగా ఖర్చు లేకుండా ఉన్నదాంట్లో బాగా ఆడేవారని, ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలైన వీటికే దేశస్థాయిలో అవార్డులు, వాటిలో మన రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు వస్తాయని తెలిపారు. సిద్ధిపేటలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ క్రీడలు జరగనున్నాయన్నారు.

ఇప్పటికే అన్నీ ఆటలకు నెలవుగా సిద్ధిపేట మారిందని, సిద్ధిపేటకు వాలీబాల్ అకాడమీ మంజూరైనట్లు, మిమ్మల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వాలీబాల్ అకాడమీలో మంచి కోచింగ్ పెట్టి రెసిడెన్షియల్ ఆకమోడేషన్ పెట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ ఫూల్, క్రికెట్ స్టేడియం ఉన్నాయని, ఇండోర్ షటిల్ కోర్టు ఉన్నప్పటికీ సరిపోతలేదని తన దృష్టికి తెస్తే మరో రెండు ఇండోర్ షటిల్ కోర్టులు మంజూరు చేయించానని నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే అందుబాటులో వస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పొద్దున్నే 6 గంటలకు పిల్లల్ని మైదానంలోకి తెచ్చేవిధంగా ప్రయత్నం చేయాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement