Wednesday, May 1, 2024

MBNR: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ పాగా…

కాంగ్రెస్ పార్టీ మ‌రో మునిసిపాలిటీని త‌న ఖాతాలో వేసుకుంది..న‌ల్గొండ జిల్లాలో ఇప్ప‌టికే రెండు మునిసిపాలిటీల‌ను చేజిక్కించుకున్న‌హ‌స్తం పార్టీ తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ను కూడా ద‌క్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు ఓటింగ్ జ‌రిగింది.

మొత్తం 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల కౌన్సిలర్లు మొత్తం 36 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్ తమ పదవులను కోల్పోయారు.

- Advertisement -

మొత్తం 49 మంది కౌన్సిలర్లలో మెజారిటీ స్థానాలను దక్కించుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. బీఆర్ఎస్లో ఉన్న కౌన్సిలర్ ఆనంద్ గౌడ్, మరికొంతమంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను విభేదించి కాంగ్రెస్‌లో చేరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనితో 32 మంది ఇటీవల జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు శనివారం అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎంత ప్రయత్నించినా ప్రయోజన లేకపోయింది. దీనితో చైర్మన్, వైస్ చైర్మన్లు పదవులను కోల్పోయారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లలో నుండి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎంపిక చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement