హైదరాబాద్ – తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు కాకుంటే.. ఓటింగ్తో పనిలేకుండా వీళ్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కష్టపడి పని చేస్తే గుర్తింపు ఉంటుంది – ఉత్తమ్
ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్నారు. ఇందుకు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నిదర్శనమన్నారు. వీరు సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వారి కష్టానికి, త్యాగానికి సరైన ఫలితం దక్కిందన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు(డిసెంబర్ 9వ తేదీన) రాజీనామా చేశారు. దీంతో జనవరి 4వ తేదీన ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా ఓటింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.