Friday, May 3, 2024

TS: చంద్ర‌బాబు, రేవంత్ లు ఉన్న‌త‌స్థాయికి.. ఎన్టీఆర్ నేర్పిన క్ర‌మ శిక్ష‌ణే – రేణుకా చౌద‌రి

ఖ‌మ్మం – ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని వెల్ల‌డించారు.

‘నేను ఈ జిల్లా ఆడబిడ్డను. నాకు కొత్త కొత్త బిరుదులు ఇచ్చి నన్ను ఈ ప్రాంతానికి దూరం చేయొద్దు. నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేత ఎన్టీఆర్. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి చాలా మందిని ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నా పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా అనే వారు. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా.. ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి. రాజకీయాల్లో కొన్ని మార్పులుండొచ్చు, గోడలు మారొచ్చు కానీ పునాది మారదు.’ అని రేణుకా చౌదరి అన్నారు.

భవిష్యత్తులో తాను కూడా బస్సుల్లోనే తిరగాలనుకుంటున్నాను.. అంత సౌకర్యంగా ఉందన్నారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారన్నారు. ఇంకా 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని మహిళలు కోరుకుంటున్నారన్నారు. నిరుద్యోగ సమస్య మీదే ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిరుద్యోగులకు తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఇక్కడ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఖమ్మం నుండి గార్ల వరకు రైల్వే ప్లాట్ ఫాం లు తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినవేన‌న్నారు. ఫిష్ రీసెర్చ్ స్టేషన్ పాలేరులో తాను ఉన్నప్పుడే ఏర్పాటు చేశానన్నారు.

- Advertisement -

మాజీ మంత్రి ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని నిలబడ్డందుకు ముస్తఫాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఖిల్లాకు సౌండ్ లైట్ షో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లాగా పేరు గాంచిందన్నారు. భద్రాచలం రామయ్య సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి దాని అభివృద్ధికి కృషి చేస్తాన‌న్నారు. రేణుకా చౌదరికి మాత్రమే ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు వుందని, సోనియా గాంధీ ఖమ్మం వస్తే సంతోషమ‌ని, సోనియా గాంధీ నిర్ణయం వచ్చే వరకు ఎవరూ అభ్యర్థి కాదని రేణుకా చౌద‌రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement