Thursday, May 2, 2024

MDK: కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్… హ‌రీష్ రావు

ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హ‌రీష్ రావు.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇక కాంగ్రెస్ నేత‌ల తీరును ఎండ‌గ‌డుతూ, కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని తేల్చి చెప్పారు..

తెలంగాణ కెసిఆర్ తేవ‌డం వ‌ల్లే ప‌థ‌కాలు వ‌చ్చాయి..నీళ్లు వ‌చ్చాయి..
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని అన్నారు.. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామాలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్‌ అని గుర్తు చేశారు.

ఓడినా ప్ర‌జ‌ల వెంటే ఉంటాం…
ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement