Friday, May 17, 2024

TS: వైద్యరంగలో అద్భుత ఘట్టం.. నేడు 3 సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు శంకుస్థాపన

తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్‌ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్‌ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి.  అల్వాల్‌ (బొల్లారం), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌)లో టిమ్స్‌ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మూడు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు సీఎం కేసీఆర్ నేడు భూమి పూజ చేయ‌నున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు గ‌డ్డి అన్నారంలో, అనంత‌రం స‌న‌త్‌న‌గ‌ర్ చెస్ట్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఆస్ప‌త్రికి భూమి పూజ‌ చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు అల్వాల్ ఆస్ప‌త్రికి భూమి పూజ చేస్తారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు.

మూడు సూప‌ర్‌‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్స్‌ నిర్మాణ పను‌ల కోసం తెలం‌గాణ ప్రభుత్వం రూ.2679 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఎల్బీ‌న‌గ‌ర్‌లో నిర్మిం‌చ‌త‌ల‌పె‌ట్టిన సూప‌ర్‌‌స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు, సన‌త్‌‌న‌గ‌ర్‌లో నిర్మించే దవా‌ఖా‌నకు రూ.882కోట్లు, అల్వాల్‌ దవా‌ఖా‌నకు రూ.897 కోట్లు కేటా‌యిం‌చారు.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యవసరంగా ఏర్పాటైన గచ్చిబౌలి టిమ్స్‌ను ఆధునీకరించడంతోపాటు మిగతా మూడు టిమ్స్‌ అవతరించనున్నాయి. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లో జీ+14 విధానంలో దవాఖాన భవనాలు నిర్మిస్తారు. అల్వాల్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతం కావడంతోపాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపడతారు. ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి. రాజీవ్‌ రహదారికి ఆనుకొని ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ టిమ్స్‌ను నిర్మించనున్నారు. మూడు టిమ్స్‌ల కోసం ప్రభుత్వం రూ.2,679 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

గ్రేటర్‌ చుట్టూ నిర్మిం‌చ‌నున్న నాలుగు సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖా‌నల వల్ల రాష్ట్రం‌లోని పలు జిల్లా‌లకు చెందిన ప్రజ‌లకు కూడా వైద్య‌సే‌వలు మరింత చేరు‌వ‌కా‌ను‌న్నాయి. ముఖ్యంగా అల్వా‌ల్‌–‌ఓ‌ఆ‌ర్‌‌ఆర్‌ మధ్య నిర్మిం‌చ‌నున్న సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖాన వల్ల సిద్ది‌పేట, కరీం‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌ తది‌తర జిల్లాల ప్రజలు ట్రాఫిక్‌ సమస్య లేకుండా సులు‌వుగా చేరు‌కో‌వచ్చు. అంతే‌కా‌కుండా వైద్య‌సే‌వలు సకా‌లంలో పొందే వీలుం‌టుంది. గడ్డి‌అ‌న్నారం పండ్ల మార్కె‌ట్‌లో నిర్మిం‌చ‌నున్న సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖాన వల్ల నల్ల‌గొండ, వరం‌గల్‌, యాదా‌ద్రి–‌భు‌వ‌న‌గిరి తది‌తర జిల్లాల ప్రజ‌లకు, గచ్చి‌బౌ‌లి‌లోని టిమ్స్‌ వల్ల రంగా‌రెడ్డి, సంగా‌రెడ్డి, మెదక్‌ జిల్లాల ప్రజ‌లకు వైద్య‌సే‌వలు చేరువ కావ‌డంతో పాటు సుల‌భంగా దవా‌ఖా‌న‌లకు చేరు‌కునే వీలుం‌టుంది. ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నగ‌రం‌లోని నిమ్స్‌, ఉస్మా‌నియా, గాంధీ వంటి దవా‌ఖా‌న‌లకు వెళ్లా‌ల్సిన అవ‌సరం లేకుండా గ్రేటర్‌ సరి‌హ‌ద్దులో ఉన్న నూతన సూప‌ర్‌‌స్పె‌షా‌లిటీ దవా‌ఖా‌నల ద్వారా సేవలు పొందే వీలుం‌టుంది.

‘తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్లే.. తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తరు. తెలంగాణ ప్రజల బాగుకోసం కష్టపడుతరు’.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పే మాట అక్షరాలా నిజం. ఇందుకు తార్కాణం తెలంగాణ రాష్ట్రమంతా వైద్యరంగ విస్తరణ. రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటానికి ముందే ప్రారంభమయ్యాయి. గాంధీ దవాఖాన 170 ఏండ్ల క్రితం మొదలుకాగా, ఉస్మానియాకు వందేండ్ల చరిత్ర ఉన్నది. చివరగా నిమ్స్‌ దవాఖాన హైదరాబాద్‌ రాష్ట్రంలో 1951లో ఏర్పాటైంది. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దాదాపు 65 ఏండ్ల పాలనలో తెలంగాణలో ఒక్క సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన కూడా ఏర్పాటు చేయలేదు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ దవాఖానల వరకు అన్ని స్థాయిల్లో ఆధునిక వసతులు కల్పించారు. గాంధీ, నిమ్స్‌, ఉస్మానియాకు నిధులిచ్చి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగలిగే స్థాయికి వసతులు సమకూర్చారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తూ స్పెషాలిటీ సేవలను విస్తరిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో యుద్ధ ప్రాతిపదికన గచ్చిబౌలిలో 1,500 పడకలతో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో హెల్త్‌ సిటీ నిర్మాణం చేపట్టారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఒత్తిడి తగ్గించడంతోపాటు జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఎక్కడికక్కడ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు హైదరాబాద్‌ నలువైపులా టిమ్స్‌లు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement