Sunday, May 5, 2024

మే డే … గులాబీ డే…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం. కార్మికులకు బీమాను ఇస్తు న్నాం. కర్షకుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా చూస్తు న్నాం. ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్నాం. ఆటో వాలాను ఆదుకుంటున్నాం. బీడీ కార్మికు లకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఉద్యోగులకు జీతాలు పెంచాం. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తున్నాం. ఇలా ప్రతి విషయంలో కార్మిక లోకానికి అండగా ఉంటున్నామంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. ఘనంగా కార్మిక దినోత్స వాన్ని నిర్వహించాలని గులాబీ అధినేత పార్టీ శ్రేణు లకు ఆదేశాలు ఇచ్చారు. వాడవాడలా.. గల్లి గల్లి నా మే డే వేడుకలను జరపాలని సూచించింది. 9 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మిక లోకానికి చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వారికి వివరించాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పార్టీ నేతలకు సీరియస్‌గా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్లీనరీ వేడుకల్లోనూ చర్చించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పాల్గొని జెండాలను ఎగరవేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

కార్మిక భవనాలు
రాష్ట్రంలో కార్మికుల కోసం ఇన్యూరెన్స్‌ను ప్రభుత్వమే భరిస్తుంది. నెలకు ఒక్క రూపాయికే ఈ సదుపాయాన్ని అందిస్తుంది. లేబర్‌ కార్డులను సైతం జారీ చేస్తుంది. భవన నిర్మాణ సంక్షేమం కోసం బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలు, ఎలక్ట్రిషీయన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు, ఇతర కూలీలకు వర్తిస్తుంది. ఈ పథకం కింద మే డే రోజు కార్మికులకు లక్ష కార్డులను ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. కార్మికులకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కార్మిక భవనాలను నిర్మించాలని కూడా డిసైడ్‌ అయ్యారు. అందుకు సంబంధించి పార్టీ నేతలతో పలు సార్లు సీఎం కేసీఆర్‌ చర్చించారు. ఈ వేడుకల్లో కార్మిక భవనాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించనున్నారు. కొన్ని చోట్ల భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. మిగతా జిల్లాల్లోనూ అదే విధంగా కార్మిక భవనాలను నిర్మించి ఇవ్వనున్నారు.

గల్లి గల్లినా మే డే.. శ్రమశక్తి అవార్డులు
రాష్ట్ర వ్యాప్తంగా మే డే వేడుకలను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. స్థానిక కార్మిక విభాగం నేతలు, కార్మికులతో కలిసి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొననున్నారు. వారి ఆధ్వర్యంలో మే డే వేడుకలను నిర్వహించడమే కాకుండా కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్మికులకు ప్రభుత్వం నుంచి అందించే గుడ్‌ న్యూస్‌ను స్వయంగా తెలియజేయాలని కూడా స్పష్టం చేశారు. ఉత్తమ కార్మికులను గుర్తించి శ్రమ శక్తి అవార్డులను అందజేయనున్నారు. సన్మానాలు చేయనున్నారు. కష్టపడిన వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపును ఇస్తున్నదన్న సంకేతాలను ఇవ్వబోతోంది.

తెలంగాణ భవన్‌లో వేడుకలు
మే డే రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు సార్లు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్లీనరీలోనూ స్పష్టం చేశారు. పార్టీ అనుబంధ సంస్థ బీఆర్‌టీయూ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను గులాబీ పార్టీ నిర్వహించబోతుంది. కార్మికులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని ఇప్పటికే యూనియన్‌ నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. కార్మిక వ్యతిరేకి ప్రధాని మోదీ అన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

- Advertisement -

వరాల జల్లులు
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మే డే రోజు కార్మికులపై వరాల జల్లులు కురిపించబోతోంది. ప్రమాద బీమా గతంలో 2 లక్షల రూపాయలు ఉండేది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని 6 లక్షలకు పెంచింది. ఇప్పుడు మే డే సందర్భంగా మరో సారి పెంచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 8 లక్షలు లేదా 10 లక్షలు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. సీఎం కేసీఆర్‌ కార్మికులకు మరికొన్ని సంక్షేమ పథకాల్లోనూ లబ్ధి చేకూరేలా వరాల జల్లులు కురిపిస్తారని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కార్మికులకు అండగా కేసీఆర్ -రాంబాబు యాదవ్‌, బీఆర్‌టీయూ అధ్యక్షుడు
దేశంలో కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్‌. అనేక సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చారు. ఆటో కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వ బీమాను అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చారు. అర్చకులకు జీతాలు పెంచారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తూ ఫ్యాక్టరీల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం అన్యాయం. కార్మికులంతా కేంద్ర విధానాలపై పోరాటం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement