Thursday, May 2, 2024

BRS – వంద రోజులు మౌనంగా ఉండాలని ఉన్నా…ప్ర‌జ‌లు ఊరుకునేలా లేరు… కాంగ్రెస్ హామీల‌పై హ‌రీష్ రావు

హైద‌రాబాద్ – ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక కాంగ్రెస్ నేతలు కర్నాటకలో చేతులెత్తేశార‌ని, .. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తార‌ని జ్యోస్యం చెప్పారు మాజీ మంత్రి, బిఆర్ ఎస్ నేత హ‌రీష్ రావు…. గ్యారెంటీల అమలు విషయంలో.. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడే వాళ్లమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో నాగర్‌కర్నూల్ లోక్ స‌భ స‌మీక్ష స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ అన్నారని.. ఇప్పుడి వాళ్ల సిఎం ఎందుకెళ్లార‌ని ప్ర‌శ్నించారు. . దావోస్ కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా..? అంటూ నిల‌దీశారు..

ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారంటూ పేర్కొన్నారు.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమంటూ వ్యాఖ్యానించారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలన్నారు.

ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌ఘడ్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారిందని.. ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదన్నారు. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని.. మన బడ్జెట్ ఎంత..? 2 లక్షల 90 వేల కోట్లు.. అంటూ హరీష్‌రావు గుర్తుచేశారు. సంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని.. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు.కాగా, బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న బండి వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేననన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని చుర‌క‌లంటించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించి తమను బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్‌ రావు మండిపడ్డారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక లో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందంటూ గుర్తుచేశారు. దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానానికి చేరిందంటే అది కేసీఆర్ ఘనతేనన్నారు. తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు తమిళనాడు కేరళ మాత్రమేనంటూ పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్దిని కేసీఆర్ జోడు ఎడ్లలా కొనసాగించడం వల్లే.. గత పదేళ్లలో తెలంగాణ పేదరికం 83 శాతం తగ్గిందన్నారు. నీతి ఆయోగ్ నివేదిక తోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, వేమల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూధనాచారి, ఎంపి రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement