Tuesday, April 30, 2024

BJP Election Campaign – ఒక‌టో తేదిన జీతాలు కూడా ఇవ్వ‌ని కెసిఆర్ ను సాగ‌నంపండి – ఓట‌ర్ల‌కు బండి పిలుపు

క‌రీంన‌గ‌ర్ – ఒక‌టో తేదికి జీతాలివ్వ‌ని స్థితికి తెలంగాణ‌ను తీసుకొచ్చిన కెసిఆర్ కు ఓటుతో బుద్దిచెప్పాల‌ని క‌రీంన‌గ‌ర్ బిజెపి అభ్య‌ర్ధి, ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ ఓట‌ర్లుకు పిలుపు ఇచ్చారు.. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే ఇక ప్ర‌జ‌ల బ‌తుకులు రోడ్డు మీదే అంటూ వ్యాఖ్యలు చేశారు. వాళ్లది కబ్జాల ఆరాటం…. తనది పేదల పోరాటం అన్నారు. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి అని కరీంనగర్ ప్రజలను కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో సోమ‌వారం నాడు నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ,
” గంగుల కమలాకర్ కు మూడుసార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు, గుట్టలను మాయం చేసిండు. పొరపాటున ఈసారి మళ్లీ గెలిపిస్తే మీ ఇండ్లను కొట్టేయడం ఖాయం. అబద్ధాలు ఆడడంలో గంగులను మించినోడు లేడు. నన్ను అవినీతిపరుడు అంటున్నాడు. నేను అధికారంలోనే లేను, అవినీతికి ఎలా పాల్పడతాను ? ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే, నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు ? నా ఆస్తిపాస్తుల డాకుమెంట్లు అన్నీ తీసుకురావాలి… అవన్నీ ప్రజలకు ఇచ్చేస్తాను. మరి గంగుల కూడబెట్టిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లు తీసుకొస్తే, అవన్నీ ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమా ? కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలవదు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఎలా ఇస్తారో కూడా తెలవదు. భూకబ్జాలు చేయడం తప్ప, ప్రజల కోసం ఎన్నడు కొట్లాడనేలేదు. ఇద్దరు అభ్యర్థులది భూకబ్జాల పంచాయతీ. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం నాది. కాబట్టి, ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని” కోరారు.

నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికో ఉద్యోగం ఏమైంది? అని ప్రశ్నించారు. త‌న ఇంటిలోని అయిదుగురికి ఉద్యోగాలిచ్చుకున్న కెసిఆర్ తెలంగాణ య‌వ‌త‌ను రోడ్డున ప‌డేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు బండి సంజ‌య్.. ముస్లిం ఓట్ల కోసం మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. హనుమాన్ చాలీసాను ఉత్సాహంగా చదివే ధైర్యం ఒవైసీకి ఉందా? సంజయ్ ప్ర‌శ్నించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement