Friday, May 3, 2024

కెసిఆర్, కెటిఆర్ జైలుకు పోవ‌డం ఖాయం – పోలీసుల సంగ‌తి తేలుస్తాః బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ – కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసిన కరీంనగర్ ,వరంగల్ పోలీస్ లపై ప్రివిలేజ్ కమిటీ కి వెళ్తామని హెచ్చ‌రించారు. అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా నా మొబైల్ ఫోన్ అడ‌గ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు.. వ‌రంగ‌ల్ సిపి రంగ‌నాద్ త‌న అధికార టోపి ముందు ఈ కేసు విష‌యంలో ప్ర‌మాణం చేసి నిజాయితీని నిరూపించుకోవాల‌ని అన్నారు. మా అత్త‌య్య చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నామీద ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూప‌లేద‌ని అన్నారు.. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్ర‌శ్నించారు..క‌నీసం ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పర‌ని, ముంద‌స్తు నోటీసులివ్వరని అంటూ పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు బండిసంజ‌య్.

లీకుతో తనకు సంబందం లేదని , తన పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తాన‌ని, త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌లేద‌ని సిపి రంగ‌నాథ్ ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా అంటూ నిల‌దీశారు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వ‌హిస్తామ‌న్నారు.. టెక్నాల‌జీలో తోపు అని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను ఎందుకు చేధించడం లేదన్నారు.. దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కెసిఆర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు..

ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధమ‌న్నారు.. అస‌లువరంగల్ కమిషనర్ కు తెలివి ఉందా? , షేర్ చేస్తేనే అరెస్ట చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు..మీ చేతగానతనాన్ని మాపై నెడతారా? అంటూ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ ఎద్దేవా చేశారు.. వ‌రంగ‌ల్ క‌మిషనర్ సంగతి తేలుస్తాన‌ని, నల్గొండ సహా ఇతర జిల్లాల్లో ఏమేం చేశారో అన్నీ బయటకు క‌క్కిస్తామ‌ని హెచ్చ‌రించారు..టిఎస్ పి ఎస్ సి పేప‌ర్ లీకేజ్ తో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైతుంటే కేసీఆర్ ఎందుకు స్సందించర‌న్నారు బండి.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూనే.. మూడు డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట పెట్టారు.

TSPSC పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని.. అప్పుడే దోషులందరూ బయటకు వస్తారనిపేర్కొన్నారు. కచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు..అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారాయన. 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని.. వారి తరపున మాట్లాడి నందుకే త‌న‌ను కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించారని మండి పడ్డారు బండి సంజయ్. ఈ మూడు డిమాండ్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని.. ప్రతి జిల్లాల్లో.. ప్రతి మండలంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. త్వరలో వరంగల్‌లో నష్టపోయిన యువతతో ర్యాలీ చేస్తామన్నారు . కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదని హెచ్చరించారాయన.
లోక్ స‌భ‌కు పంపిన లేఖలో త‌న‌ను బొమ్మల రామారంలో రిలీజ్ చేసిన‌ట్లు పేర్కొన్నార‌ని, అయితే జైలుకు ఎందుకు పంపారని ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపించారు.. అరెస్ట్ పేరుతో గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పార‌ని అన్నారు. లీకైన పేపర్ ను జర్నలిస్లు షేర్ చేస్తే తప్పేంటి? అన్నారు.

ప్ర‌జా ప్ర‌తినిధిగా తాను 2 వేల మందితో సెల్ఫీలు దిగుతాన‌ని,అయితే అందరితో లింకులున్నట్లేనా? అన్నారు. ఇక మంత్రి హారీష్ రావు పై కూడా బండి విరుచుకుప‌డ్డారు..త‌న‌పై పీడీ యాక్ట్ కేసు పెట్టాలంటున్న హరీష్ పై హత్యానేరం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు..1400 మంది బలిదానాలకు కారకుడు హరీషే న‌ని ఆరోపించారు..కేటీఆర్ ను సీఎం చేస్తే మొద‌ట పార్టీ నుంచి జంప్ అయ్యేది హరీషేన‌ని అన్నారు..

ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణానికి కారకుడైన కేటీఆర్ పై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. దేశంలోని ప్రతిపక్షాలన్నింటికీ డబ్బులిస్తానని చెప్పిన కేసీఆర్ సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై పైనా, ఆత్మహత్యలు, ఉద్యోగుల జీతాలు సహా ప్రజా సమస్యలపై నిలదీస్తే పిచ్చోళ్లంటారా? అంటూ బండి మండిప‌డ్డారు. తాగుబోతు చేతిలో తెలంగాణ ఉందంటూ ప‌రోక్షంగా కెసిఆర్ ని టార్గెట్ చేశారు..కెసిఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించుకుంటార‌ని దీంతో తెలంగాణ ప్రజలు బర్బాద్ కావాలా? అంటూ పేర్కొన్నారు. దమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రావాల‌ని కెసిఆర్ ని కోరారు. ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు సిద్దమా? అంటూ స‌వాల్ విసిరారు తెలంగాణపై కేసీఆర్ కు తెగదెంపులయ్యాయ‌ని,ఇక కెసిఆర్ తో పాటు కొడుకు, బిడ్డను జైలుకు పంపడం ఖాయమ‌ని అన్నారు. ఉద్యమంలో జై తెలంగాణ అంటూ జెండా మోసిన వాళ్లంతా ఏమయ్యారు? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు..

- Advertisement -

సింగరేణిలో సమ్మె చేస్తామన్న కేసీఆర్ సర్కార్ కు దమ్ముందా? అని అన్నారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే అంటూ 49 శాతం వాటా ఉన్న కేంద్రం ప్రైవేటీకరణ ఎలా చేయగలదని ప్ర‌శ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణను బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తామ‌ని పేర్కొన్నారు. సింగరేణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని, ఏడాదికోసారి కేసీఆర్ కుటుంబం వాటాలు పంచుకుంటుందని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొడుకుకు అహంకారం తలకెక్కింద‌ని, దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం పాలన చేస్తోంద‌ని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, అరాచకాలపై ప్రజలు విసిగెత్తిపోయారంటూ కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు మరో ఉద్యమానికి ప్ర‌జ‌లు సిద్ద‌మ‌వుతున్నార‌ని సంజ‌య్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తాలారా…. తెలంగాణ కోసం కలిసి రండి అంటూ పిలుపు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సిద్ధమైనా కేసీఆర్ స‌హ‌క‌రించ‌డం లేద‌న్నారు..

ఇక రేపు సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో జ‌రిగే ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ స‌భను అడ్డుకుంటే తెలంగాణ అభివ్రుద్దిని అడ్డుకున్నట్ల్లే నని బండి సంజయ్ అన్నారు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకే ప్రధాని తెలంగాణ పర్యటన కు వస్తున్నారని అన్నారు.
వందే భారత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ సహా పలు అభివ్రుద్ది పనుల ప్రారంభానికే ప్రధాని శనివారం వస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక పాలనపై దృష్టి మళ్లించేందుకు రచ్చ చేసే యత్నం చేస్తున్నారని అన్నారు
ప్రధానిని అడ్డుకోవాలనే కేసీఆర్ కుటుంబం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని బండి పిలుపునిచ్చారు. అలాగే రేపు సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో జ‌రిగే ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ స‌భ పెద్ద సంఖ్య‌లో హాజ‌రుకావాల‌ని బండిసంజ‌య్ పిలుపు ఇచ్చారు.. త‌న అరెస్ట్ , విడుద‌ల‌లో త‌న‌కు అండ‌గా ఉన్న జాతీయ నాయకత్వానికి, లీగల్ టీం, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement