Monday, April 29, 2024

నాలుగో విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు ఏర్పాట్లు.. ఈనెల 12 నుంచి 22 వరకు యాత్ర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగనుంది. గణేష్‌, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పదిరోజులకే కుదించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, ఉప్పల్‌, ఎల్బీ నగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ , పాదయాత్ర సహా ప్రముఖ్‌ తూళ్ళ వీరేందర్‌ గౌడ్‌, జిల్లా బాలకృష్ణలతో కలిసి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి. మనోహర్‌ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. అనంతరం మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి నిర్వహించున్న నాలుగో విడత బండి సంజయ్‌ పాదయాత్రను ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ పాదయాత్ర హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్నందున ఆయా కమిషనరేట్లకు పాదయాత్ర వివరాలను అందజేశామన్నారు.

ఈనెల 12న కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్‌ ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈనెల 22వ తేదీన అంబర్‌ పేట ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలో పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో పార్టీ జాతీయ నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీజేపీ నిర్వహించిన మూడు విడతల ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మొత్తం 40 నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్‌ పాదయాత్ర చేశారని ఆయన తెలిపారు. నాలుగో విడత కలిపి మొత్తం 48 అసెంబ్లి నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి కానుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్‌లో భిన్నమైన సమస్యలు ఉన్నాయని అన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, రాజీవ్‌ స్వగృహ, ట్రాఫిక్‌తో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, గతుకుల రోడ్లు, కాలుష్యం, డంపింగ్‌ యార్డు, డ్రైనేజీ వంటి సమస్యలను పాదయాత్ర సందర్బంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని మనోహర్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement