Saturday, May 4, 2024

TS: అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలి.. మోడీ చర్యలు దేశ భద్రతకు పెను ముప్పు : బోయినపల్లి

భారత ఆర్మీలో అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రధాని మోడీ చర్యలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారాయ‌ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అగ్నిపథ్ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ వల్ల దేశంలో యువత ఆందోళన చెందుతోందని, అశాంతితో రగిలిపోతున్న యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయిన రైల్వే, ఎల్ఐసి, బి ఎస్ ఎన్ ఎల్, బ్యాంకులు, బి హెచ్ ఈ ఎల్, ఆయిల్ కంపెనీలు, ఈసీఐఎల్ వంటి అనేక సంస్థలను మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, అందులో భాగంగానే అత్యంత కీలకమైన ఆర్మీలో సైతం ప్రైవేటీకరణను చేసేందుకు పావులు కదుపుతున్నారని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

జై కిసాన్, జై జవాన్, నినాదం దేశంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తోందని, ఈ నినాదాన్ని మోడీ నీరుగార్చుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం రైతులు, భారత జవాన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడీ చర్యలు దేశంలో నిరుద్యోగాన్ని మరింతగా పెంచేవిధంగా ఉన్నాయని ఆయన మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement