Friday, May 17, 2024

సమావేశానికి రాని అధికారులపై చర్యలు..

తాండూరు : ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన తాండూరు మండల సర్వసభ్య సమావేశం వాడివేడీగా సాగింది. ఆరోగ్య, ఇందిరాక్రాంతి, విద్యుత్‌, పంచాయితీ రాజ్‌, చిన్న నీటి పారుదల శాఖలపై వాడివేడి చర్చ సాగింది. సమావేశం ప్రారంభం కాగానే అధికారులు అధికారుల గైర్హాజరుపై సభ్యులు ద్వజమెత్తారు. ప్రతీసారి మండల సమావేశాలకు అధికారులు సరిగ్గా రావడం లేదని, అధికారులు రాని సమావేశాలు ఎందుకు అని నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమావేశానికి రాని అధికారులపై చర్యలకు తీర్మాణం చేయనున్నట్లు ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌ పేర్కొనడంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం పలువురు అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. విద్యుత్‌ శాఖ ఏఈ ప్రభాకర్‌ ప్రగతి నివేదికలను చదివి వినిపిస్తుండగా తాండూరు-2 ఎంపీటీసీ సిడంగి శంకర్‌, సూరం రవీంధర్‌రెడ్డిలు కల్పించుకొని గతంలో కొత్తపల్లి శివారులోని సర్వేనెంబర్‌ 154లో లబ్దిదారులకు పట్టాలు ఇచ్చారని, అందులో కొందరు ఇండ్లు నిర్మించుకొని విద్యుత్‌ లేక చీకట్లోనే నివాసం ఉంటున్నారని ఆయన దృష్టిక తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏఈ ప్రభాకర్‌ సమాధానం ఇస్తూ గ్రామపంచాయితీ తీర్మాణం లేకపోవడంతోనే విద్యుత్‌ సరఫరా ఇవ్వలేకపోతున్నామని అన్నారు. దీంతో కొత్తపల్లి సర్పంచ్‌ వేల్పుల రజిత మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే తీర్మాణం ఇచ్చామని తెలిపారు. కార్యదర్శులపై పర్యవేక్షణ కరువైందని ఎంపీఓ అక్తర్‌పై ఎంపీటీసీ శంకర్‌ ద్వజమెత్తారు. ఇదే విషయమై సూరం రవీంధర్‌ అడిగిన ప్రశ్నకు తహశిల్దార్‌ కవిత మాట్లాడుతూ సర్వేనెంబర్‌ 154లో గతంలో పట్టాలు ఇచ్చారని, అక్కడ కట్టడాలు నిర్మించుకోకపోవడంతోనే 2017, 2018 సంవత్సరంలో రెండు పడక గదుల తీర్మాణానికి ఏఈపీఆర్‌కు హ్యాండోవర్‌ చేయడం జరిగిందని అన్నారు. అందులో పల్లె ప్రకృతి వనం, రైతువేదికకు భూమిని కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, వైస్‌ ప్రెసిడెంట్‌ దాగం నారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement