Friday, May 3, 2024

సింగరేణిలోకి వస్తే తరిమికొట్టాలి – ప్రభుత్వ విప్ బాల్క సుమన్

బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇకపై బీజేపీ నాయకులు సింగరేణిలోకి వస్తే తరిమి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పిలుపునిచ్చారు. సోమవారం మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన కేసీఆర్ కు కృతజ్ఞత సభలో మాట్లాడుతూ… చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని, ఇందుకుగాను నియోజకవర్గ రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎత్తిపోతల పథకంతో 98 వేల ఎకరాలకు సాగునీరందుతుంద‌ని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సింగరేణి గనుల వద్దకు బీజేపీ నాయకులు వస్తే తరిమి కొట్టాలన్నారు. ఎన్నికలు వస్తే మత కల్లోలాలు సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. బీజేపీకి తెలంగాణలో కాంగ్రెస్ బీ టీం గా తయారైందని, హుజురాబాద్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టాడన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల చేయించుకున్న సర్వేలో చెన్నూరులో తెరాస భారీ మెజార్టీతో గెలుస్తుందని స్పష్టమవడంతో రెండు పార్టీలు ఖంగుతిన్నాయన్నారు. అమిత్ షా కొడుకు అరబ్ షేక్ లతో వ్యాపారం చేస్తుంటే ఇక్కడ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement