Sunday, April 28, 2024

PM MODI: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో టీ-బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా మోడీ హాజరయ్యారు. నా కుటుంబ సభ్యలందరికి నమస్కారం అంటూ మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని సూచించారు. కుటుంబ పార్టీల్లో ఉండేది రెండేనని.. ఒకటి దోచుకోవడం.. రెండు అబద్ధాలు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నా కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అనుకుంటున్నారు అని సెటైర్ వేశారు. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి అవుతోందని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందున్నారు. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందన్నారు.

దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇది ఎన్నికల సభ కాదని.. ఎన్నికలు తేదీలు ఇంకా ప్రకటించనే లేదన్నారు. దేశంలో ఈ రోజు వికాస ఉత్సహం జరుగుతోందని.. 15 రోజుల్లోనే రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎస్‌, పలు రైల్వే, రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. 15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశామన్నారు. మీరందరూ వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు. ఆదివారం కేంద్రమంత్రులు, అధికారులతో కేబినెట్ భేటీ నిర్వహించానని.. ఈ భేటీలో ఎన్నికల గురించి కాకుండా వికసిత్ భారత్‌పైనే చర్చించామన్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. మళ్లీ బీజేపీకి ఓటేయాలని ఈ సందర్భంగా మోడీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement