Friday, April 26, 2024

రాహుల్ గాంధీ లేక‌పోతే నేను లేను.. న‌టి ర‌మ్య‌

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ త‌న‌కి అండ‌గా నిల‌బ‌డ్డార‌ని తెలిపింది రాజ‌కీయ‌నాయ‌కురాలు..న‌టి ర‌మ్య‌.. త‌న తండ్రి చనిపోయిన రెండు వారాలకే తాను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. అయితే అప్పటికీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకేమీ తెలియదన్నారు. అంతా కొత్తగా ఉన్నప్పటికీ.. ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పని వైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. లైఫ్‌ లో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీనే ఉంటారు. ఓ వైపు నాన్న మరణం, మరోవైపు ఎన్నికల్లో ఓడిపోవడంతో బాగా నిరాశ చెందాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.

అలాంటి కష్ట సమయంలో రాహుల్‌ గాంధీ నాకు అండగా నిలబడ్డారు. మానసికంగా ధైర్యమిచ్చారు అని చెప్పుకొచ్చింది రమ్య.తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ కన్నడలో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి అమృత వర్షం అనే మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలో కథానాయికగా కనిపించి మెప్పించింది. ఇలా కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది రమ్య. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య.. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement