Sunday, May 19, 2024

Postmortem : సింగర్​ సిద్దూ మూస్​వాలా ఎవరు? అతడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది!

తన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్​ సిద్ధూ మూస్ వాలా. అతడి గన్ కల్చర్ అంటే జనాలకు చాలా ఇష్టం. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్స్ ను అతడు హీరోల్లా భావించేవాడు. అతడి ప్రతి పాటలో అది స్పష్టంగా కనిపించేది. తన పాటల ద్వారా చీకటి రాజ్యాన్ని కీర్తించేవాడు. కొన్ని వివాదాస్పద పాటలతో ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూశాడు. ఎప్పుడూ గన్స్ తో కనిపించే సిద్ధూ.. చివరికి వాటికే బలవుతాడని ఎవరూ ఊహించలేదు.

మొన్న (శనివారం) గుర్తుతెలియని దుండగులు సింగర్​ సిద్దూమూస్​వాలా ప్రయాణిస్తున్న జీప్​పై కాల్పులు జరిపి దారుణంగా చంపేశారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లా.. జవహర్కే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిద్ధూ కేవలం గాయకుడే కాదు కాంగ్రెస్ లీడర్​ కూడా. అయితే.. పంజాబ్ ప్రభుత్వం మూస్ వాలాతో సహా 424 మందికి భద్రతను ఉపసంహరించుకున్న తర్వాతి రోజే ఈ ఇన్సిడెంట్​ జరగడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.. దీన్ని బట్టి.. సిద్ధూను హత్య చేయడం కోసం ప్రత్యర్థులు ఎప్పటి నుంచో కాపు కాసినట్లు తెలుస్తోంది. అయితే.. విచిత్రం ఏమిటంటే సిద్ధూ తన మరణాన్ని ముందే ఊహించినట్లు తెలుస్తోంది. తన చివరి పాట ‘లాస్ట్ రైడ్’ తరహాలోనే హత్య జరిగినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 

ఇంతకీ సిద్దూ మూస్​వాలా ఎవరంటే..

సిద్ధూ మూస్ వాలా అసలు పేరు శుభదీప్ సింగ్ సిద్ధూ. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూస్ వాలా గ్రామంలో జూన్ 17, 1993న జన్మించాడు. సిద్ధూకు మిలియన్ల కొద్ది అభిమానులున్నారు. అయితే.. సిద్ధూ గ్యాంగ్‌స్టర్ రాప్‌లకు ప్రసిద్ధి చెందాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన ఇతను.. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత కెనడాకు వెళ్లాడు. సిద్ధూ మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ది. అతడు తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రచారం చేసేవాడు. సెప్టెంబరు 2019లో విడుదలైన అతని పాట ‘జట్టి జియోనే మోర్హ్ ది బందూక్ వార్గీ’ వివాదంలో చిక్కుకుంది. 18వ శతాబ్దానికి చెందిన సిక్కు యోధుడు మై భాగో గురించి ఆ పాటలో ప్రస్తావించినందుకు మత పెద్దల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది.  

మే 2020లో బర్నాలా గ్రామంలోని ఫైరింగ్ రేంజ్‌లో ఏకే 47తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, సంగ్రూర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతడు బెయిల్ నుంచి విడుదలైన తర్వాత జులై 2020లో ‘సంజు’ పాటతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.  సోషల్ మీడియాలో విడుదలైన ఈ పాటలో సిద్ధూ తనను తాను నటుడు సంజయ్ దత్‌తో పోల్చుకున్నాడు. 

- Advertisement -

సిద్దూని చంపింది ఎవరు?

పంజాబ్​ సింగర్​ సిద్ధూపై ఎనిమిది మంది దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే- రైఫిళ్ల బుల్లెట్లు లభ్యమయ్యాయి. పంజాబ్‌లో ఏకే గన్స్​ వాడకం చాలా అరుదు. సిద్ధూ హత్యకు తామే బాధ్యలమని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్, గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు గోల్డీ బ్రార్ ప్రకటించాడు. 

కాగా, పంజాబ్‌లో పేరొందిన గాయకులకు గ్యాంగ్‌స్టర్‌ల నుంచి బెదిరింపులు రావడం సర్వ సాధారణం. ప్రముఖ గాయకుడు మికా సింగ్‌కు కూడా గ్యాంగ్‌స్టర్‌లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ మీడియా సంస్థకు తెలిపాడు. తాను సంపాదించిన మొత్తం నుంచి వాటా ఇవ్వడం లేదనే కారణంతో చాంపేస్తామని బెదిరించారని వెల్లడించాడు. అయితే.. సిద్దూని చంపింది ఎవరైనా సరే వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement