Tuesday, April 30, 2024

PM Modi: దేశంలో డిజిటల్ అగ్రికల్చర్‌ పెంచడమే లక్ష్యం

దేశంలో డిజిటల్ అగ్రికల్చర్‌ పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. దీంతో సాగు రంగంలో పెనుమార్పులు సంభవిస్తాయని తెలిపారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆయనకు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూస్ జ్ఞాపికను బహూకరించారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలకు సూచించారు. ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు. వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్‌ పరిశోధనలు దోహదం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంట దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని మోదీ.. చిన్న రైతుల సాగు వ్యయాన్ని తగ్గించాలని చెప్పారు.

దేశంలోని 80% కంటే ఎక్కువ చిన్న రైతులపై మా దృష్టి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ 2022-23 సహజ వ్యవసాయం & డిజిటల్ వ్యవసాయంపై దృష్టి పెట్టిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో పామాయిల్ రంగంలో ఏరియా వినియోగాన్ని 6.5 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ప్రధాని వెల్లడించారు. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రతపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తాము గత 7 సంవత్సరాలలో అనేక బయో-ఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేశామని ప్రధాని మోదీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement