Monday, May 6, 2024

ఉపరాష్ట్రపతి ఔదార్యం.. విధివంచిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. విజయవాడకు చెందిన విధివంచిత కుటుంబానికి తమ జీతం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. రోజూ దినపత్రికలు చదవడంలో భాగంగా, విజయవాడ దినపత్రికలో వచ్చిన చిన్న వార్త ఆయన్ను కదిలించింది.

విజయవాడకు చెందిన చింతా కుమారి, శివప్రసాద్ లు ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రిషియన్ గా భర్త సంపాదనతో హాయిగా సాగుతున్న వారి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి. శివప్రసాద్ పిట్టగోడ మీద కూర్చుని ఉండగా, ఆ గోడ హఠాత్తుగా పడిపోవడం వల్ల ఆయన వెన్ను దెబ్బతింది. భర్త భారంతో పాటు, పిల్లల భారాన్ని మోస్తున్న ఆమె గురించి పత్రికలో వచ్చిన వార్తను చూసిన ఉపరాష్ట్రపతి వెంటనే వివరాలు కనుక్కోవలసిందిగా సహాయకులను ఆదేశించారు.

వివరాలు తెలిసిన వెంటనే ముందుగా ఆయన జీతం నుంచి లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. భర్తకు అమ్మలా మారి, పిల్లలకు ఆదరువుగా ఆమె నిలబడిన విధానం ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకమంటూ ఆయన అభినందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, కుమారిలా జీవితంలో నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికలో వచ్చిన చిన్న వార్తకు స్పందించి తమకు వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఉపరాష్ట్రపతి ఔదార్యానికి చింతా కుమారి, శివప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement