Sunday, April 28, 2024

విశ్వ బతుకమ్మ!

దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫా నెత్తిన బంగారు ‘బతుకమ్మ’
బుర్జ్‌ ఖలీఫాపై జై కేసీఆర్‌ నినాదం.. చిత్రం
ఖండాంతరాలు దాటిన సాంస్కతిక వైభవం
పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం
బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం
ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం
ఆకర్షించిన తెలంగాణ సాంస్కతిక చిహ్నం బతుకమ్మ దశ్య నివేదనం
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణకే తలమానికమైన పూల పండుగ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించడం ద్వారా ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి 9.40కు దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. బతుకమ్మ వీడియోను బూర్జ్‌ ఖలీఫా తెరపై రెండుసార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా
ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం బూర్జ్‌ ఖలీఫా స్క్రీన్‌పై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బూర్జ్‌ ఖలీఫా కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
దేశానికే గర్వకారణం: కల్వకుంట్ల కవిత
బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ట్రానికేగాక దేశానికి సైతం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడంలో చరిత్రలో నిలిచిపోతుందన్న కవిత ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బూర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత పుష్కర కాలంగా బతుకమ్మ పండుగను ప్రతియేటా ఎమ్మెల్సీ కవిత పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించిన కవిత బతుకమ్మ పండుగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేశారు. పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్ని ప్రతియేటా ఊరూ వాడా ఘనంగా జరుపుకునేందుకు కవిత ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో సైతం తెలంగాణ ఆడబిడ్డలంతా గొప్పగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకు నడుం బిగించినట్లు ప్రకటించిన కవిత అందులో భాగంగా ప్రతియేటా సరికొత్త విధంగా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించారు. శనివారం దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ పూల పండగ మరోసారి మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు కల్వకుంట్ల కవితతో పాటు నిజామాబాద్‌ ఎమ్మెల్యేలు, నేతలు తరలివెళ్ళగా అపూర్వస్వాగతం లభించింది. ఖలీఫాపై బతుకమ్మను చూసిన నేతలు సంభ్రమాశ్చర్యాలకు, ఆనందానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్‌, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్‌, డాక్టర్‌ సంజయ్‌, బిగాల గణష్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్‌, దాస్యం విజయ్‌ భాస్కర్‌, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement