Friday, May 17, 2024

కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేకు బెయిల్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెంప పగలగొట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు రాయ్‌గఢ్‌లోని మహద్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రాణే అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని, ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన న్యాయస్థానం రాణేకు బెయిలు మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్‌ రాణెను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్‌ యాత్రలో ఉన్న ఆయన్ని రత్నగిరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా, జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్ జిల్లాల్లో పర్యటించిన నారాయణ్ రాణే మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నాళ్లయిందో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదని, అలాంటి వ్యక్తిని పట్టుకుని చెంపలు పగలగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన భగ్గుమంది. పలు చోట్ల కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన నాయకులు ముంబయిలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌తో పాటు, నాసిక్‌, పుణెల్లోనూ కేసులు నమోదయ్యాయి. నిన్న ఆయన రత్నగిరి పర్యటనలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించారు. తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌ పోలీసులకు అప్పగించారు. రాత్రి పొద్దుపోయాక మహాద్‌లోని మెజిస్ట్రేట్‌ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలు మంజూరైంది. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం బాంబే హైకోర్టులో రాణె తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

- Advertisement -

ఈ వార్త కూడా చదవండిః జగన్‌ను ఫాలో అవుతున్న షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement