Thursday, April 25, 2024

రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొని.. ముగ్గురు యువకుల మృతి

రాపూరు (రూరల్‌), (ప్రభ న్యూస్‌ ) : నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. రాపూరు మండలం సిద్ధవరం గ్రామ సమీపంలోని బండెపల్లి వద్ద రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాపూరు ఎస్సై గీతా రమ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. డక్కిలి నుంచి రాపూరు వైపు పల్సర్‌ మోటారు సైకిల్‌పై లింగసముద్రం గ్రామానికి చెందిన ఉదయ్‌ , అలాగే రాపూరు నుంచి డక్కిలి మండలం సంఘనపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ , వెలికిల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గ్లామర్‌ మోటారు సైకిల్‌ పై వెళ్తున్నారు.

సిద్ధవరం సమీపంలోని బండేపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న రెండు మోటారు సైకిళ్లు అతివేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సునీల్‌ (20) తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఉదయ్‌ (25), శ్రీనివాసులు (23)ను రాపూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్‌ మృతిచెందగా , మెరుగైన చికిత్స కోసం శ్రీనివాసులును గూడూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు రాత్రి 9.30 గంటల సమయంలో మృతిచెందాడు.

ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా , ఉదయ్‌ ,శ్రీనివాసులు, సునీల్‌లు అతి చిన్న వయస్సులోనే మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement