Monday, April 29, 2024

TTD Student – ఆయోధ్య రామాల‌య ప్ర‌ధానార్చ‌కుడిగా మ‌నోడే….

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు చకాచకా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూజలు ప్రారంభమయ్యాయి. ఈ స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. 22 ఏళ్ల యువ‌కుడికి ఆయోధ్య‌ రామాల‌యం ప్ర‌ధాన అర్చ‌క పీఠం అప్ప‌గించ‌డం అది కూడా తిరుమ‌ల వేద విద్యాల‌యంలో విద్యా బుద్ధులు నేర్చుకున్న వ్య‌క్తి కావ‌డం ప్ర‌ధాన చ‌ర్చ‌గా సాగుతోంది.

1992 నుంచి అర్చ‌క బాధ్య‌తలు చూస్తున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కు 85 ఏళ్లు రావ‌డంతో కొత్త ప్ర‌ధాన అర్చ‌కుడిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆల‌య ట్ర‌స్ట్ ఆయ‌న‌కే అప్ప‌గించింది. ఈ మేరకు 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు 3 వేల మంది పూజారులు ప్రధానార్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు. దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.

ఇంట‌ర్వ్యూ ప్యాన‌ల్‌లో మ‌హామ‌హులు..
ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ్ దాస్ ఉన్నారు. వారంతా వేదాల నుంచి ఆరాధనా పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆరంభించారు. ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏంటి, పూజ పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలు సంధించారు. ఇంటర్వ్యూకి వచ్చిన 200 మందిలో చివరకు 21 మందిని అర్చ‌కులను ఎంచుకున్నారు. అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు 20 మంది సహాయ అర్చకులను ఎంచుకున్నారు.

ఎంతోమంది అనుభ‌వ‌జ్ఞులున్నా..
వారందిరిలోనూ చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 ఏళ్ల వయసు గల మోహిత్ రామ మందిర ప్రధానార్చకుడిగా నియమించబడ్డాడనే వార్త సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మోహిత్ తన కంటే ఎంతో పెద్ద పండితులను, అనుభవం ఉన్న పూజారులను ఓడించాడు. ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు. ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలు పొందాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే రామాయణం, మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్‌లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్‌లో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు. ఎస్.వీ.వీ.యూ బీఏ ప్రోగ్రాంలో చేరాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధం అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించనున్నాడు. మార్చిలో ప్ర‌ధాన అర్చ‌క భాద్య‌త‌లు చేప‌ట్ల‌నున్న‌ట్లు స‌మాచారం..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement