Wednesday, May 1, 2024

‘త్రివిక్ర‌మ్ శ్రీనివాస్’ బ‌ర్త్ డే స్పెష‌ల్..ర‌చ‌యిత నుండి స్టార్ డైరెక్ట్ గా సినీ ప్ర‌స్థానం..

మాట‌ల మాంత్రికుడు..ఆయ‌న రాసే డైలాగ్స్ నిత్యం జీవితంలో జ‌రిగే ఘ‌ట‌న‌ల‌కి సంబంధించిన‌విగా ఉంటాయి..మాట‌ల ర‌చ‌యిత నుండి స్టార్ డైరెక్ట‌ర్ గా ఆయ‌న ఎదిగిన తీరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న పుట్టిన‌రోజు నేడు.. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేశాడు. బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగశ్రీనివాస్. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఆకెళ్ల ఉదయ భాస్కరరావు, నరసమ్మలకు దంపతులకు జన్మించాడు. భీమవరంలోని డి.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎం. ఎస్. సి పూర్తి చేసుకుని స్వర్ణ పతకం సాధించాడునువ్వే కావాలి, చిరునవ్వుతో, నువునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవా లాంటి సినిమాలకి డైలాగ్స్ రాశారు. పంచ్ లు అంటే ఇలాపేలాలి అనేలా యువ రచయితలకు దిశానిర్దేశం చేసారు త్రివిక్ర‌మ్. పేరాలకు పేరాలు రాసేసి పేల్చేయనవసరంలేదు. జస్ట్ వన్ లైన్ పంచింగ్ తో అందరినీ అలరించటం త్రివిక్రమ్ సొంతం.

నిజ జీవితంలో సంఘటనలోనుంచి, వాస్తవ జీవితాన్నుంచే మాటలను ఒడిసి పట్టి వాటిని వెండితెరపై పలికిస్తాడు. అందమైన విజువల్స్‌తో, ఆలోచింపజేసే మాటలతో, ఆకట్టుకునే అనుబంధాలతో సినిమా రూపంలో సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో త్రివిక్ర‌మ్ కి లేరు ఎవ‌రు సాటి.అయితే రైటర్స్.. డైరెక్టర్స్ అవ్వడం చాలా కామన్. కథను ఎలా మలుపుతిప్పాలి, కథనానికి ఏ మలుపుదగ్గర మెలికపెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫిక్టివ్ గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్ కి తీసుకెళ్లాలి వంటి క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాస్‌ని బాగా వంట బ‌ట్టించుకున్నాడు. అతడుతో త్రివిక్రమ్ అంటే అందరికీ ఓ బెంచ్‌ మార్క్‌ ఏర్పడింది. హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా త్రివిక్రమ్‌ భారీ చిత్రాలతో అలరిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేశాడు.. మహేష్ బాబుతో రెండు, అల్లు అర్జున్‌తో మూడు, పవన్ క‌ల్యాణ్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్‌, ప్రస్తుతం మ‌హేష్‌తో సినిమా చేసేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్‌కి మాట‌లు అందిస్తున్నాడు.త్రివిక్రమ్‌, పవన్‌ మంచి స్నేహితులు. వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. బాగా పుస్తకాలు చదువుతారు. పవన్‌ ఏం చేయాలన్నా త్రివిక్రమ్‌ సలహాలు తీసుకుంటారని టాక్‌.

నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారి, అతడుతో డైరెక్ట‌ర్ గా తానేంటో నిరూపించుకున్నారు త్రివిక్ర‌మ్. ఆ త‌ర్వాత‌ జల్సా, జులాయ్‌, ఖలేజా, సన్నాఫ్‌ సత్యమూర్తి, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నారు. ఇందులో ఖలేజా, అజ్ఞాతవాసి పరాజయాలు చెందగా, అత్తారింటికి దారేదీ, అలా వైకుంఠపురములో చిత్రాలు రికార్డ్‌ కలెక్షన్లని వసూలు చేయడం విశేషం. ద‌ర్శ‌కుడిగా..మాట‌ల ర‌చ‌యిత‌గా దూసుకుపోతోన్న ఆయ‌న మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కోరుకుంటూ ఆయ‌న‌కి బ‌ర్త్ డే విషెష్ తెలుపుతోంది ఆంధ్ర‌ప్ర‌భ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement