Wednesday, May 15, 2024

సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొత్త నిబంధన

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన, పార్లమెంటులో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికకు కసరత్తులు చేస్తోంది. 1984-87 బ్యాచ్‌లకు చెందిన 100 మంది పేర్లను పరిశీలించి అందులో నుంచి వడపోతల అనంతరం ముగ్గురితో తుది జాబితా రూపొందించింది.

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డీజీ) సుబోధ్ కుమార్ జైస్వాల్, సశస్త్ర సీమాబల్ డీజీ కేఆర్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన.. హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత విభాగం) వీఎస్కే కౌముది సీబీఐ కొత్త చీఫ్ రేసులో మిగిలారు. వీరిలో ఒకరిని సీబీఐ అత్యున్నత పదవికి ఎంపిక చేయనున్నారు.

అయితే సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ‘ఆరు నెలల రూల్’ ను సీజేఐ ఈ భేటీలో ప్రస్తావించారు. ఈ నిబంధంన ప్రకారం ఏ ఐపీఎస్ అధికారి అయినా కనీసం ఆరు నెలల పాటు సర్వీసు మిగిలి ఉంటేనే… వారు పోలీస్ చీఫ్ పదవులకు అర్హులని సీజేఐ రమణ తెలిపారు. ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే ఈ మేరకు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలెక్షన్ ప్యానెల్ కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. సీజేఐ లేవనెత్తిన ఈ పాయింట్ కు అధిర్ రంజన్ చౌధురి మద్దతు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement