– వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్)
హైదరాబాద్ అనందబాగ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కిడ్నాపర్లను పట్టుకొనేందుకు హైదరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు రంగం లోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కిడ్నాపర్లు బాలుడుని తీసుకొని జనగామ జిల్లా పాలకుర్తి వైపు వెళుతున్నట్లుగా వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వరంగల్ కమీషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు పాలకుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వశ్వర్ తన సర్కిల్ పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు అలర్ట్ అయి వాహనాలు తనిఖీలు చేపట్టాలని సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వశ్వర్ ఆదేశాలు జారీచేశారు. దాంట్లో భాగంగా కొడకండ్ల పోలీసు కానిస్టేబుల్ రఘుపతి కొడకండ్ల మండలం రామచంద్రపురం శివారులో వాహన తనిఖీలు చేపట్టాడు.
కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించిన కానిస్టేబుల్ రఘుపతి తక్షణమే అప్రమత్తమై స్థానికుల సహకారంతో ఇద్దరు కిడ్నార్లను చేజ్ చేసి పట్టుకొన్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడైన హర్షవర్ధన్ ను కాపాడారు. కిడ్నాపర్ల ను పోలీసులు అదుపు లోనికి హైదరాబాద్ ఎస్. ఓ. టి పోలీసులకు సమాచారం అందించారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ రఘుపతి.. రెడ్ హ్యాండెడ్ కిడ్నాపర్లను పట్టుకోవడమే కాకుండా, బాలుడిని సేవ్ చేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
కొడకండ్ల పోలీసులు బాలుడిని రక్షించడంతో, బాలుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడిని రక్షించిన కానిస్టేబుల్ రఘుపతి తో పాటు, పాలకుర్తి ఇన్స్ పెక్టర్ విశ్వేశ్వర్ ,జనగామ ఎసిపి దేవేందర్ రెడ్డి ని వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ అభినందించారు.