Friday, April 26, 2024

డబుల్ బెడ్ రూం ఇండ్లతో నిరుపేదల కల సాకారం.. సీఎం కేసీఆర్‌ దైవంతో సమానంః మంత్రి గంగుల‌

డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోనే కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించినట్లు చెప్పారు.

నిరుపేదలకు డబుల్ బెడ్ రూం సొంత ఇండ్ల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ తండ్రి లాంటి వాడని దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కమాన్ పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్.ఎం.డి ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి రిహాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని , మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని తెలిపారు. మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్ పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు.

రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వెంటనే మారాలని ఆయన కోరారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులు ఎవరికి అమ్ముకోరాదని, ఇతరులకు కిరాయికి ఇవ్వరాదని, ఇది చట్టరిత్యా నేరమని లబ్దిదారులు మాత్రమే స్వంత డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివారు అధైర్య పడవద్దని అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్లు సీరియల్ నెం. 7,8,9,10,11 గృహాలలో లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు.

కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎలక్ట్రిసిటీ డి.ఈ. రాజిరెడ్డి, ఏడి రాజు, ఎం.పి.పి శ్రీలత-మహేష్, కొత్తపెల్లి తహశిల్దార్ శ్రీనివాస్, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, తదితరులు పాల్గొనారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement