Tuesday, May 7, 2024

Telangana అసెంబ్లీలో వాట‌ర్ వార్‌! మంట‌పెట్టిన‌ నీళ్లు

భేటీకి ముందే మాట‌ల యుద్ధం
రండి అస‌లు వాస్త‌వం తేల్చుకుందాం
స‌వాల్ చేసిన‌ సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్ వైఖ‌రితోనే ప్రాజెక్టుల‌ను కోల్పోయాం
సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసిన సీఎం
ఇన్నాళ్లు కాపాడితే కేంద్రానికి ఇచ్చారు
అంతే దీటుగా రిప్ల‌య్ ఇస్తున్న కేటీఆర్‌, హ‌రీశ్‌
కాళేశ్వ‌రంపై సీబీఐ విచార‌ణ ఏదంటున్న బీజేపీ
మూడు పార్టీలకూ నీళ్లే బ‌ల‌మైన అస్త్రం

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వాటర్‌ వార్‌ చర్చనీయాంశంగా మారింది. కేఆర్‌ఎంబీ అంశంతో రెండు జాతీయ పార్టీలను టార్గెట్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైతే.. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశాలతో గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. ఇవే అంశాలను తమకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ. ఇక‌.. సీఎం రేవంత్ ఒక‌డుగు ముందుకేసీ అసెంబ్లీకి రండి.. అక్క‌డే తేల్చుకుందాం అంటూ స‌వాల్ చేశారు. కేసీఆర్ హ‌యాంలోనే ప్రాజెక్టుల‌ను కోల్పోయామ‌ని సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేశారు. దీనికి దీటుగా బీఆర్ ఎస్ నేత‌లు రిప్ల‌య్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు క‌ష్ట‌ప‌డి కాపాడిన కృష్ణా ప్రాజెక్టుల‌ను కేంద్రం చేతికి అప్ప‌జెప్పార‌ని, ఇది కాంగ్రెస్ చేత‌గాని త‌నం అని మండిప‌డుతున్నారు. ఇక‌..మూడు పార్టీల‌కు ఇప్పుడు నీళ్లే ప్ర‌ధాన అస్త్రంగా మారాయి.

తెలంగాణలో వాటర్‌ వార్‌ హీటెక్కిస్తోంది. అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏకంగా విచారణకు ఆదేశించింది. తాజాగా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి కారణం కేసీఆర్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. అయితే.. పదేళ్ల పాలనలో ఏనాడూ అందుకు ఒప్పుకోలేద‌ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పనిలో పనిగా బీజేపీ సైతం రెండు పార్టీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు ప్రారంభించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సాగు నీటి సమస్య పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి జలాల వినియోగం కోసం ప్రాణహిత-చేవెళ్లను రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం.. ప్రతిపక్షాలకు ఒక ప్రచార అస్త్రంగా మారింది.

పూర్తిస్థాయి విచారణ..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల లోటుపాట్లపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసేందుకు కాంగ్రెస్‌కు ఇదో అస్త్రంగా మారిపోయింది. ఓ వైపు కాళేశ్వరం వివాదం నడుస్తూ ఉండగానే.. కృష్ణా జలాల వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. నదీ జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం హక్కులు కోల్పోవాల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. రేవంత్‌ సర్కారుకు ముందుచూపు లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించిందని మండిపడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. దీనివల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగడంతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతోందని కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌. అసెంబ్లీలో నీటి ప్రాజెక్ట్ ల‌పై చర్చ‌కు సిద్ద‌మంటూ కాంగ్రెస్ కు స‌వాల్ విసిరింది.. ప్రాజెక్ట్ ల‌పై రేవంత్ చేస్తున్న ప్ర‌తి ఆరోప‌ణ వాస్త‌వం కాద‌ని అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామంటూ బీఆర్ ఎస్ ముఖ్య నేత‌లు కేటీఆర్‌, హరీష్ తేల్చి చెప్పారు.

బీఆర్ ఎస్ నిర్ల‌క్ష్య‌మేనంటూ కాంగ్రెస్ మండిపాటు..

- Advertisement -

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని, కేసీఆర్ సూచనతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారన్నారు. అంతేకాకుండా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారని సీఎం ఆరోపిస్తున్నారు.

అస‌లు విష‌యం ఇదేనంటున్న బీఆర్ ఎస్‌..
అయితే.. అప్ప‌టి సీఎం కేసీఆర్‌ వల్లే నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌తో బీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ నేతలైన జైరాం రమేశ్‌, జైపాల్‌రెడ్డి ప్రతిపాదించిన విషయాన్ని గులాబీ పార్టీ తెరపైకి తీసుకువస్తోంది. ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్‌తో పాటు.. అటు కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసేందుకు రెడీ అవుతున్నాయ‌ని దూకుడు పెంచి, ఎదురు దాడి ప్రారంభించారు బీఆర్ ఎస్ నేత‌లు.

ఆ రెండు పార్టీలు ఒక‌టే అంటున్న బీజేపీ..

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ కుంభకోణాలపై విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని నిల‌దీస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

చ‌ర్చిద్దాం రండి.. సీఎం రేవంత్ సవాల్

కేసీఆర్.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!! అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స‌వాల్ విసిరారు. అసెంబ్లీలో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రావాల‌ని కోరారు. అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుదాం అన్నారు. రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దామ‌ని, కావాలవంటే సమావేశాలను మ‌రో రెండు రోజులు పొడగిద్దాం అని తెలిపారు. ఇక‌.. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అందరూ రావాల‌ని, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలోనే తేల్చుకోవాల‌ని చెప్పారు. తాను, ఉత్తమ్ ఇద్దరమే మాట్లాడుతాం. తెలంగాణ‌కు ఎవరు ద్రోహి, ఎవరు అన్యాయం చేశారో తేలిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement