Wednesday, May 8, 2024

గేట్‌ ఫలితాల్లో తెలంగాణ సత్తా.. వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థికి ఫస్ట్​ ర్యాంకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గేట్‌(గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)-2022 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఒకరికి మొదటి ర్యాంకు వరించగా, మరోకరికి 9వ ర్యాంకు వరించింది. వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు నిరంజన్‌ మెటలార్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 9వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న మణిసందీప్‌ రెడ్డి అశిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకోవడంతో ఆయనకు నీట్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ ఎన్‌వి.రమణారావు అభినందించారు. ఇటీవల కాలంలో గేట్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నప్పటికీ ఈ సారి వెలువడిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు తెలుగు విద్యార్థికి దక్కడం విశేషం.

ఈ సారి గేట్‌ పరీక్షలో కొత్తగా రెండు పేపర్లు చేర్చారు. వీటితో కలిపి మొత్తం సబ్జెక్ట్‌ పేపర్ల సంఖ్య 29కి చేరింది. మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహించారు. గేట్‌ స్కోరు మొత్తం మూడేళ్ల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. గేట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన స్కోర్‌కార్డులను మార్చి 21 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగినై ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. గేట్‌ ఫలితాలతో పాటు ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గేట్‌-2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలను గురువారం విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement